ఆత్మకూరు, జూన్ 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆత్మకూరు తహసీల్దార్ పద్మజాకుమారి రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ డిక్లరేషన్ ఫారాలను అందజేయాలని సూచించారు.
ఇంటింటి సర్వే సమయంలో ఫారాల్లో పొందుపరిచిన వివరాలను ప్రజలతో ధృవీకరించుకుని సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. అలాగే ప్రతి దరఖాస్తుదారుడి నుంచి రెండు కలర్ పాస్పోర్ట్ సైజు ఫొటోలను సేకరించాలని ఆదేశించారు.ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, ప్రతి ఒక్కరూ సరైన వివరాలు అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సిబ్బందికి తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తహసీల్దార్ పద్మజాకుమారి పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


