తాళ్లపూడి, జూలై 28 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో రైతులకు “ఎల్నినో ప్రభావం – ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి యాజమాన్యం, పంటల బీమా” అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులకు వరి పంటకు ఎకరానికి ₹570, మినుము పంటకు ₹300, అరటి పంటకు ఎకరానికి ₹3,000 ప్రీమియం చెల్లించి పంటల బీమా పొందవచ్చని వివరించారు. రుణం తీసుకున్న రైతులు బ్యాంకులు లేదా సహకార సంఘాల ద్వారా, రుణం తీసుకోని రైతులు సీఎస్సీ కేంద్రాలు లేదా పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
వరి పంటకు ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15, 2026 వరకు, మినుము, అరటి పంటలకు జూలై 31, 2026 వరకు గడువు ఉందని తెలిపారు. తాడిపూడి సహకార సంఘం అధ్యక్షుడు నామా కొండబాబు, రైతు నాయకుడు సిద్ధన రాధాకృష్ణ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే అపరాలు, చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని, ప్రతి రైతు పంటల బీమా చేయించుకుని ఆర్థిక రక్షణ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రుచిత, రెవెన్యూ అధికారులు, వీఎచ్ఏ గౌతమి మరియు రైతులు పాల్గొన్నారు.


