ఎంపీడీవో కు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వినతి పత్రం ఫలితం శూన్యం
పున్నమి న్యూస్
27 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
యాచారం మండల కేంద్రంలో నంది వనపర్తి రోడ్డుపై ప్రజల ఆగ్రహం
దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
సమస్య పరిష్కారం చేయకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
సయ్యద్ జానీ ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలోని నంది వనపర్తి రోడ్డుకు సంబంధించిన సమస్యపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డుకు సంబంధించి పలుమార్లు స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసినప్పటికీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పరిష్కారం జరగలేదని ప్రజలు ఆరోపించారు.
రోడ్డుపై నామమాత్రంగా కంకర పరిచి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు వాపోయారు. ప్రతిరోజూ భారీగా ఎగిసిపడుతున్న దుమ్ము ధూళి కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సయ్యద్ జానీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే త్వరలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, కాలనీవాసులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు కోరారు.



