హైదరాబాద్, జూలై 3
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిస్కంల బకాయిలు తదితరాల వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీ కలిపి రెండున్నరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్లకు పైగా చెల్లించామని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
అధిక వడ్డీ రేట్లతో తీసుకున్న రుణాలను డెట్ రీ-స్ట్రక్చరింగ్ చేయడం ద్వారా 2025-26 నుంచి 2031-32 మధ్య చెల్లించాల్సిన రుణభారాన్ని గణనీయంగా తగ్గించి రాష్ట్రానికి రూ.22,142 కోట్ల మేర ప్రజాధనం ఆదా చేశామని వెల్లడించారు.
సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అత్యాధునిక జియో ఫెన్సింగ్ వ్యవస్థ ఉన్నందున బొగ్గు అక్రమ రవాణాకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
సంక్షేమ హాస్టళ్లపై కూడా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచడంతో పాటు, డైట్ ఛార్జీలను ప్రతి నెలా సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. యూనిఫాంలు, షూస్, పుస్తకాల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
అబద్ధాల పునాదులపై ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమని పేర్కొన్న భట్టి విక్రమార్క, ప్రజల ముందు వాస్తవాల ఆధారంగా చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల ఆస్తులు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.



