పున్నమి ప్రతినిధి ,తిరుపతి, 2026 జూన్ 26
అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో జ్ఞానభక్తి వైభవం
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు శుక్రవారం రాత్రి అపూర్వ ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు సరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణల మధ్య వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది.
వీణ ధరించి సరస్వతీ అలంకారంలో దివ్య దర్శనం
వీణను ధరించి సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులను విశేషంగా అనుగ్రహించారు. హంస మంచి, చెడులను గుర్తించి మంచిదానినే స్వీకరించే జ్ఞానానికి ప్రతీక. సరస్వతీదేవి వాహనమైన హంసపై విహరించిన స్వామివారు భక్తులు నిర్మలమైన మనస్సుతో, మంచి ఆలోచనలతో జీవించాలని, అలాంటి వారి హృదయాల్లో తాను ఎల్లప్పుడూ కొలువై ఉంటాననే దివ్య సందేశాన్ని అందించారు.
భక్తి, సంగీతం, వేదఘోషల నడుమ దివ్యోత్సవం
వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భజన మండళ్ల గానామృతం, కోలాటాల మధ్య సాగిన హంసవాహన సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. స్వామివారి దివ్యరూపాన్ని దర్శించిన భక్తులు గోవింద నామస్మరణతో మాడవీధులను మారుమోగించారు.
శనివారం ఉదయం సింహవాహనం – రాత్రి ముత్యపు పందిరి వాహనంపై దివ్యమంగళ విహారం
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం 8.00 గంటలకు సింహవాహనంపై, రాత్రి 7.00 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు కరుణాకటాక్షాలు ప్రసాదించనున్నారు. ఈ దివ్య వాహనసేవల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టిటిడి భక్తులను కోరుతోంది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్.ఈ. శ్రీ నరసింహామూర్తి, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీమతి శ్రీవాణి, శ్రీ సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
—————————-
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

