భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్
పున్నమి ప్రతినిధి. తిరుమల జూలై 31
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని జేఈవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
భక్తుల వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో తగిన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేయాలని, వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ముఖ్య ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
స్థానిక ఆలయాలు, ప్రధాన భవనాలు, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్, అలిపిరి నడక మార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో అదనపు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య ప్రాజెక్టులో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.
భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులను నియమించి సేవలను మరింత విస్తృతంగా అందించాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి. రవిని ఆదేశించారు.
శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల్లో అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అత్యుత్తమ సేవలు అందించాలని జేఈవో సూచించారు.
ఈ సమావేశంలో ఎస్ఈ–1 శ్రీ మనోహరం, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి, విజిలెన్స్ అధికారి శ్రీ గిరిధర్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
—
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.



