అనపర్తి, జూలై 31 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే, దివంగత నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆగస్టు 1న ఆయన విగ్రహాలకు నివాళులర్పించనున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, నల్లమిల్లి మనోజ్రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆగస్టు 2న బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, సంస్కార ఫౌండేషన్, ఇండియా టర్న్స్ పింక్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటల నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్యుల సహకారంతో ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. రోగులకు భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
మూలారెడ్డి స్మారక పురస్కారాలను భారతీయం సత్యవాణి, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గుడిమెట్ల రామచంద్రరెడ్డికి అందించనున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఆగస్టు 2న పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ప్రజలు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.


