*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* విద్యాశాఖాధికారి (DEO), అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC), సమగ్ర శిక్షా విభాగంలోని సెక్టోరియల్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖాధికారులు (MEOలు), క్లస్టర్ ప్రధానోపాధ్యాయులతో కలిసి విశాఖపట్నం జిల్లా స్పెషల్ ఆఫీసర్ & KGBV సెక్రటరీ శ్రీ డి. దేవానంద రెడ్డి గారు శనివారం (13-12-2025) వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో Foundational Literacy and Numeracy (FLN) కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న 75 రోజుల యాక్షన్ ప్లాన్, 6వ నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం సమ్మరీ వీడియోల వినియోగం, అలాగే 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు.
విశాఖపట్నం జిల్లాలోని 506 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 1వ నుండి 5వ తరగతి వరకు 25,170 మంది విద్యార్థులకు FLNపై బేస్లైన్ టెస్ట్ నిర్వహించగా, వారి అభ్యాస స్థాయిని ఆధారంగా తీసుకుని విద్యార్థులను Sky, Mountain, Stream అనే మూడు విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు.
అలాగే జిల్లాలోని ప్రతి మూడు ప్రాథమిక పాఠశాలలకు ఒక అడాప్షన్ ఆఫీసర్ను నియమించి, ఆయా అధికారులు ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం మూడు సార్లు పాఠశాలలను సందర్శించి 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విధానాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం మూడు సార్లు 20 మార్కులకు డిక్టేషన్ టెస్ట్ నిర్వహించి, విద్యార్థులందరూ మార్చి 2026లో నిర్వహించనున్న ఎండ్లైన్ టెస్ట్లో FLN లక్ష్యాలను సాధించే విధంగా సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఇంకా మండల స్థాయిలోని హైస్కూళ్లను MEO–I మరియు MEO–IIలకు విభజించి కేటాయించి, 6వ నుండి 9వ తరగతి విద్యార్థులకు సమ్మరీ వీడియోల ప్రదర్శనను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను MEOలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా జిల్లాలోని 10,520 మంది 10వ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా, ప్రతి రోజు సాయంత్రం పరీక్షలు నిర్వహించి, మరుసటి రోజు మధ్యాహ్నం లోగా మూల్యాంకనం పూర్తి చేసి, విద్యార్థుల మార్కుల వివరాలను తప్పనిసరిగా LEAP యాప్లో నమోదు చేసే బాధ్యతను సంబంధిత MEOలు స్వీకరించాలని శ్రీ డి. దేవానంద రెడ్డి గారు ఆదేశించారు.


