ముద్గోల్, ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి ): ముద్గోల్ మండలం ముద్గల్ గ్రామంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ మేకల అనురాధ గణపతి యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం లో ఎస్సై బిట్లకు పెర్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు, రహదారులు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు దర్యాప్తులో కెమెరాల దృశ్యాలు కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామంలో భద్రత చర్యలను మరింత పటిష్టం చేయడంలో భాగంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.



