రెండో జాబితాలోనైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
పున్నమి రిపోర్టర్ | తేదీ: 15-08-2026
కెరమెరి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఖైరి గ్రామపంచాయతీ పరిధిలోని ఖైరి గ్రామానికి చెందిన మొహార్లే సవిత తన దుస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. మొదటి జాబితాలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన తాను కనీస వసతులు లేని మట్టి, తడకల ఇంట్లోనే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నానని సవిత తెలిపారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఇంటి పరిస్థితి చూసి ప్రతిరోజూ భయంతో జీవిస్తున్నామని కన్నీళ్లతో వాపోయారు.
పేదరికం కారణంగా సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకునే స్థోమత తనకు లేదని, ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లే తమ కుటుంబానికి ఏకైక ఆధారమని తెలిపారు.
“మా పరిస్థితిని చూసైనా కనికరించండి”
తమ ఇంటి పరిస్థితిని అధికారులు స్వయంగా పరిశీలించి, తన అర్హతను గుర్తించి న్యాయం చేయాలని సవిత విజ్ఞప్తి చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలోనైనా తన పేరును చేర్చి ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, తమలాంటి అర్హులైన పేద కుటుంబాలకు కూడా అవకాశం కల్పించాలని ఆమె అధికారులను వేడుకున్నారు.
పేద కుటుంబం కన్నీటి వేడుకోలు..
రెండో జాబితాపైనే ఆశలు!


