ఆర్డీవో కార్యాలయంలో ప్రజానాట్యమండలి నాయకులు సయ్యద్ షుక్కూర్, గద్దర్ బాబు ఆధ్వర్యంలో వృద్ధ కళాకారుల పెన్షన్ రూ. 8000 కు పెంచాలని వినతిపత్రం ఇచ్చారు.
ఆత్మకూరు: వృద్ధ కళాకారులకు నెలకురూ 8000 పెన్షన్ మంజూరు చేయాలని ఆత్మకూరు ప్రజానాట్యమండలి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షుక్కూర్,గద్దర్ బాబులు అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం గ్రీవెన్స్ డే లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజానాట్యమండలి , ఆత్మకూరు ప్రజానాట్యమండలి కమిటీ తరఫున వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.సాంప్రదాయ, పౌరాణిక, సాంఘిక నాటకాలు, వీధి నాటికలు, వాయిద్య కళలు, ఆట, పాట, మాట,నటన వంటి వివిధ విభిన్న కళారూపాలను ప్రదర్శిస్తూ జీవితాంతం కళాసేవలో నిమగ్నమైన కళాకారులు సమాజంలో చైతన్యం కల్పించడంలో విశేష సేవలందించారు.సామాజిక దురాచారాల నిర్మూలనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ వారు కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన వృద్ధ కళాకారులు పూర్తిగా కళలపైనే ఆధారపడి జీవనం కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న కళాకారులకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న కళాకారుల పెన్షన్ వారి జీవనానికి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, వృద్ధ కళాకారులకు అందిస్తున్న పెన్షన్ను నెలకు ₹8,000కు పెంచి, వారికి గౌరవప్రదమైన జీవనం సాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు.


