*ప్రభుత్వ కార్యాలయాల ముందే చీకటి.. వెలుగుల కోసం ఎదురుచూపులు*
*ఏన్కూరు MRO, MPDO, PS పరిసరాల్లో వెలగని వీధి దీపాలు – రాత్రి వేళ ప్రజలు, సిబ్బంది అవస్థలు*
జులై 01 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ప్రభుత్వమే చీకట్లో ఉంటే ప్రజలకు వెలుగు ఎక్కడ?”
అనేది ప్రస్తుతం ఏన్కూర్ మండల కేంద్రంలోని పరిస్థితి.
మండలంలోని కీలకమైన ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు రాత్రి వేళల్లో అంధకారంలో మునిగిపోతున్నాయి. దీంతో రోజూ వందలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న MRO, MPDO కార్యాలయం, పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారుల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలు గత కొంతకాలంగా పనిచేయడం లేదు.
పగటిపూట సందడిగా ఉండే ఈ ప్రాంతం, సూర్యుడు అస్తమించగానే పూర్తిగా చీకటిమయం అవుతుంది.
భూమి పనులు, రెవెన్యూ సర్టిఫికెట్ల కోసం సాయంత్రం వరకు కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులు, మహిళలు చీకట్లో దారి తెలియక ఇబ్బంది పడుతున్నారు.
అత్యవసర విధుల నిమిత్తం రాత్రి వేళల్లో డ్యూటీకి వచ్చే పోలీస్, రెవెన్యూ సిబ్బంది కూడా చీకట్లోనే వాహనాలు పార్క్ చేసి, ఆఫీసులకు వెళ్లాల్సి వస్తుంది.
ప్రజా రాకపోకలు అధికంగా ఉండే కూడలి కావడంతో చీకటి కారణంగా చిన్నచోరీలు, రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రమంటేనే ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. అలాంటి చోటే లైట్లు లేకపోతే ఎలా? కనీసం MRO, MPDO , PS ముందు నాలుగు లైట్లైనా వేయాలి. పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి” అని స్థానికులు కోరుతున్నారు.
ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల ముందే మౌలిక సదుపాయాలు గాలికి వదిలేయడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, మరమ్మతులు చేసి వీధి దీపాలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



