ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో విశేష ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
పతకాలు సాధించిన అధికారులు
టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి. ఉదయ్ కుమార్ – ఫోరెన్సిక్ సైన్స్, చట్టం & దర్యాప్తు రాత పరీక్షల్లో రెండు బంగారు పతకాలు, వేలిముద్రల ప్రాక్టికల్ పరీక్షలో కాంస్య పతకం.
కూసుమంచి ఎస్సై వి. దివ్య – వైద్య-న్యాయ పరిశీలన పరీక్షలో రజత పతకం, ఫోరెన్సిక్ సైన్స్ రాత పరీక్షలో కాంస్య పతకం.
ఏఆర్ కానిస్టేబుల్ ఎం. మహేష్ – యాక్సెస్ కంట్రోల్ పరీక్షలో కాంస్య పతకం.
ఏఆర్ కానిస్టేబుల్ పి. కిరణ్ – డాగ్ స్క్వాడ్ పోటీలో కాంస్య పతకం సాధించారు.
ఈ డ్యూటీ మీట్లో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ సాంబరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.



