విద్యార్థుల భద్రతే లక్ష్యం.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు: అధికారులు
ఆత్మకూరు, జూన్ 12 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం ప్రైవేట్ పాఠశాలల వాహనాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీస్ శాఖ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ఆత్మకూరు పట్టణంలో ఈ తనిఖీలను నిర్వహించారు.జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై జంపాని కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. రాములు కలిసి పాఠశాల బస్సులను పరిశీలించారు. ముందుగా ఆత్మకూరు పట్టణంలోని శ్రీనివాస పాఠశాల, రెయిన్బో పాఠశాలలతో పాటు బీఎస్ఆర్ కళాశాలలో ఉన్న విద్యార్థుల రవాణా వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ గంగాధర్ స్వయంగా స్కూల్ బస్సును నడిపి వాహన పనితీరును పరిశీలించారు. బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఎమర్జెన్సీ డోర్లు, అగ్నిప్రమాద నివారణ పరికరాలు, సీట్ల అమరిక, వాహన ఫిట్నెస్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని వాహనాల్లో గుర్తించిన లోపాలపై డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలకు సూచనలు చేశారు.ఎమర్జెన్సీ డోర్ వద్ద సీట్లు ఏర్పాటు చేయడం, డోర్లు సరిగా తెరుచుకోకపోవడం, అగ్ని ప్రమాదం సమయంలో ఉపయోగించే పరికరాల నిర్వహణలో లోపాలను గుర్తించి వెంటనే సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థుల రక్షణ పాఠశాల యాజమాన్యాల ప్రధాన బాధ్యత అని అన్నారు. వాహనాల పనితీరును ప్రతిరోజూ పరిశీలిస్తూ, డ్రైవర్ల పనితీరు మరియు ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. రాములు మాట్లాడుతూ స్కూల్ వాహనాలను ప్రతిరోజూ తనిఖీ చేయడం ఎంతో ముఖ్యమన్నారు. వాహనంలో చిన్నపాటి లోపాలు కనిపించినా వెంటనే యాజమాన్యానికి తెలియజేయాలని డ్రైవర్లకు సూచించారు.వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కల్వర్టులు, నీటి ప్రవాహ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాలను దాటించే ప్రయత్నం చేయకుండా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తీసుకువచ్చే వాహనాల పరిస్థితి, డ్రైవర్ ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు. ప్రమాదాలకు కారణమయ్యే నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రమాదం జరిగితే డ్రైవర్పై కేసు నమోదు చేయడంతో పాటు సంబంధిత పాఠశాల గుర్తింపుపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.



