గాజువాక, ఏప్రిల్ 18 (పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ సీనియర్ నేతలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గాజువాక పార్టీ కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కే. రత్నకుమారి, నూకాంబిక ఆలయ కమిటీ డైరెక్టర్ పొలిమేర ఆనంద్ కుమార్ తదితరులు పల్లాను ఘనంగా సన్మానించారు.
బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగి రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థాయికి చేరుకోవడం ఉమ్మడి విశాఖ జిల్లాల ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని నేతలు పేర్కొన్నారు. నిగర్వి, సౌమ్య స్వభావంతో నిస్వార్థ రాజకీయాలకు నిలువుటద్దంగా నిలుస్తూ ప్రజలకు అండగా ఉంటున్న పల్లా సేవలు అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని పల్లాకు అందజేశారు. కార్యక్రమంలో కాయల ప్రసన్న, కురాకుల భారతి తదితరులు పాల్గొన్నారు.



