నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి రాజీ పడవద్దని ముఖ్యంగా సిబ్బంది వేతనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెలిక్ అలైట్ అకాడమీ కి సూచించారు. బుధవారం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి మనమరాలు రేష్మ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన రెలిక్ అకాడమీ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలు కలిగిన పాఠశాల ఏర్పాటు చేయడం మార్పుకు అభినందనీయమని అన్నారు. ప్రధాన నగరాలలో ఉండే పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాల ఏర్పాటు చేయడం విశేషమని అయితే ప్రగతిసాధనలో నిరంతరం అప్రమత్తంగా పాఠశాలను నిర్వహించాలని ఏ గంట, ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలలో భారతదేశం పోటీపడుతున్న తరుణంలో ఇలాంటి చిన్న పట్టణాలలో భవిష్యత్తు తరాల మేధావులను తయారు చేసే పాఠశాలలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా తన తండ్రి విద్య అభ్యసించిన విశ్వోదయ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ దొడ్డ రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన రేష్మారెడ్డి విద్యారంగంలో కావలిలో నూతన మలుపులు తెచ్చేందుకు చేస్తున్న సాహస ప్రక్రియకు సర్వత్ర కావలి ప్రజలు తమ మద్దతు తెలపాలని కోరారు. తాను మరల పాఠశాల ప్రారంభమైన మరికొద్ది నెలలకు వచ్చి విద్యా ప్రమాణాలను పాఠశాల పనితీరును పరిశీలిస్తానని ఈ సందర్భంగా రేష్మారెడ్డితో ఛలోక్తి విసరగా తప్పనిసరిగా మీరు ఎప్పుడు వచ్చినా మీ ప్రశంసలు పొందేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఆ విధంగా పనితీరు ఉంటుందని రేష్మా రెడ్డి తెలిపారు. కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని మరిన్ని ఉన్నత విద్యాసంస్థలకు మార్గదర్శి కావాలని అభినందనలు తెలిపారు.
పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి విశ్వోదయారెక్టర్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి జ్ఞాపికలతో సత్కరించారు. ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ విద్యాధర రెడ్డి డైరెక్టర్ ప్రత్యూష రెడ్డి, లికిత్ రెడ్డి, డాక్టర్ డి.ఆర్ సేవా సమితి చైర్మన్ దొడ్ల లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



