నందలూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలాధ్యక్షులు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేడా విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్ గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పాటించాల్సిన పద్ధతులు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించారు.
అనంతరం ఆసుపత్రిలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని సూచించారు.
మేడా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాలికల ప్రాముఖ్యత, వారికి కల్పించాల్సిన ప్రాధాన్యత గురించి వివరించారు. భ్రూణహత్యలు నేరమని పేర్కొంటూ స్త్రీశక్తి గొప్పతనాన్ని వివరించారు. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించి అభినందించారు.
గత రెండేళ్లుగా నందలూరు మండలంలోని గర్భిణులకు స్కానింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్న రాజంపేట గైనకాలజిస్ట్ డాక్టర్ మస్తానమ్మను ఈ సందర్భంగా సత్కరించారు.
కార్యక్రమానికి హాజరైన గర్భిణులు, ఇతరులు కలిపి 80 మందికి పైగా పాల్గొనగా, మేడా విజయ భాస్కర్ రెడ్డి వారి కోసం భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శరత్ కమల్, డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్, డాక్టర్ హీరేందర్ సింగ్, జిల్లా కార్యాలయ వైద్య సిబ్బంది మునిరెడ్డి, రాఘవేంద్ర రాజు, ప్రసాద్తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.


