రాజన్న సిరిసిల్ల ,ముస్తాబాద్ జులై 24( పున్నమి ప్రతినిధి. )
. ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సిరిసిల్ల నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ భూక్య భాస్కర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం గొంతెత్తిన యువత, విద్యార్థులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి బీజేపీ ప్రభుత్వం బలప్రయోగానికి పాల్పడడం బాధాకరమన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని చెప్పే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు దిగడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. లాఠీచార్జ్లో గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ యువత గొంతును గౌరవించాలని ఆయన కోరారు.


