* డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధం కావాలి
* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్
* అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి
తిరుచానూరు, ఆగస్టు 8 పున్నమి ప్రతినిధి
డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ సీపీ ఉద్యమం ఉధృతం చేసింది. డీఎస్సీ నియామకాల్లో అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో చేపట్టిన రిలే, నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు స్వచ్ఛందంగా ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. నియామకాల్లో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగితే కేంద్రానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను భారీ మొత్తాలకు బేరం పెట్టి విక్రయించారంటూ భూమన ఆరోపించారు. ప్రతిభ, అర్హత ఉన్న నిరుద్యోగులను పక్కనపెట్టి అనర్హులకు ఉద్యోగాలు కల్పించారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమైన అభ్యర్థులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. అర్హత కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చెవిరెడ్డి మోహిత్రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.
తిరుచానూరులో కొనసాగుతున్న రిలే, నిరాహార దీక్షకు తిరుపతి నుంచి వచ్చిన పలువురు జూనియర్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న వారికి పూలమాలలు వేసి అభినందించారు.
జూనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలతో పాటు రాష్ట్ర విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, పేద విద్యార్థుల విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎంపీటీసీ నరేష్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ముండ్లపూడి సర్పంచ్ సురేష్రెడ్డి, రాజా, శివశంకర్రాజు, సుధాయాదవ్, సుబ్రహ్మణ్యం, రాంబాబు, పద్మనాభం, కుప్పిరెడ్డి, అవినాష్రెడ్డి, చింతాల హరి, సునీల్రెడ్డి, ధనమునిరెడ్డి, యోగానందరెడ్డి, ధరణిరెడ్డి, శరత్, ఉపేంద్రరెడ్డి, అవిలాల లోకనాథరెడ్డి, మినేటి కేశవులు, చెంచుమోహన్యాదవ్, హరికృష్ణారెడ్డి, పరందామరెడ్డి, మల్లారపు రమణ, మల్లారపు వాసు, హేమాద్రిరెడ్డి, మన్నూరు శివ, జయకర్, పద్మనాభరెడ్డి, అవిలాల శివ, ఓబుల్రెడ్డి, శశిధర్రెడ్డి, సాయిరాయల్, భానుప్రకాష్రెడ్డి, గూడూరు రఫీ, యశ్వంత్రెడ్డి, వినోద్కుమార్, సింగం తేజ, ప్రకాష్రెడ్డి, అరుణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



