కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: యూటీఎఫ్ డిమాండ్
కడప, జూలై 20: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్బాబు డిమాండ్ చేశారు.
సోమవారం సాయంత్రం కడప కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ పాలనలో గత 12 సంవత్సరాలుగా అనేక పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దాదాపు రెండు కోట్ల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.
తాజాగా జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. అలాగే టెట్కు సంబంధించిన సమస్యలతో లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసు చర్యల ద్వారా అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు అన్నారు. ప్రజాసంఘాల ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమానికి సంఘీభావంగా ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
టెట్ రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, ట్రెజరర్ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఏజాస్ అహ్మద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్, నాయకులు బత్తుల చంద్రశేఖర్, మహబూబ్ బాషా, రామకేశవ, రవూఫ్ బాషా, శివశంకర్ రెడ్డి, కొండయ్య, విశ్వనాథ్, బాబు, చెన్నయ్య, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.



