బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం, ఆగస్టు,14, (పున్నమి ప్రతినిధి)
కొత్తగూడెం నుంచి రామవరం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాత్రివేళ పెద్ద సంఖ్యలో ఆవులు, దూడలు రోడ్డుపైనే సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో వాహనాలు వేగంగా వస్తుండటంతో పశువులు అకస్మాత్తుగా అడ్డంగా రావడంతో ప్రమాదాల ముప్పు నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశువులు రోడ్డుపై గుంపులుగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. పశువుల యజమానులు వాటిని రోడ్డుపై వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి రాత్రివేళ పశువుల సంచారాన్ని నియంత్రించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. రహదారిపై వెలుతురు ఉన్నప్పటికీ పశువులు అకస్మాత్తుగా అడ్డుగా రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



