ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే, ఆయనపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మొగిలిచర్ల సైదులు, జంగిపల్లి ప్రసాద్, పమ్మి రాజేష్, యాకూబ్ పాషా తదితరులు మాట్లాడుతూ ఎంపీపై తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.
రఘురాం రెడ్డి గత రెండేళ్లలో ఏడు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని 130 ప్రశ్నల ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. రైల్వేలు, జాతీయ రహదారులు, కొత్తగూడెం ఎయిర్పోర్టు, పోలవరం ముంపు గ్రామాలు, మిర్చి రైతుల సమస్యలు, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్ర అభివృద్ధి వంటి అంశాలపై నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే ఎంపీ లాడ్స్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్ నిధులతో రూ.31.42 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని, సీఎంఆర్ఎఫ్ ద్వారా 1,905 మందికి రూ.6.45 కోట్లకు పైగా వైద్య సహాయం అందించారని వెల్లడించారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఎంపీపై నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారం పునరావృతమైతే సహించబోమని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.



