విశాఖపట్నం, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): విశాఖ నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మరో మూడు స్పీడ్ లేజర్ గన్స్ అందడంతో నగర పోలీసుల వద్ద వీటి సంఖ్య మొత్తం ఐదుకు చేరింది.
లేజర్ స్పీడ్ గన్స్ ద్వారా సుమారు 300 మీటర్ల దూరం నుంచే వాహనాల వేగాన్ని గుర్తించడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడం, ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించే అవకాశం ఉంది. ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆధారాలుగా నమోదు చేసి ఈ-చలాన్లు జారీ చేయనున్నారు.
నగరంలోని రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఈ పరికరాలతో నిఘాను ముమ్మరం చేయనున్నారు. సాంకేతిక నిఘా పెరగడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులు ఇక తప్పించుకోవడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. అయితే చలాన్లు విధించడం మాత్రమే కాకుండా, వాహనదారుల్లో ట్రాఫిక్ క్రమశిక్షణ పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.



