ఖమ్మం
(పున్నమి న్యూస్)
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, హోంగార్డ్ అధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు, శాఖకు విశిష్ట సేవలు అందించిన అధికారుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విధి నిర్వహణలో కుటుంబ సభ్యులు అందించిన సహకారం కూడా ఎంతో విలువైనదని పేర్కొంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై సయ్యద్ అమీర్ అలీ, ఏఎస్సైలు వి. హనుమంతరావు, జి. చిన్నప్ప, టి. ప్రసాదరావు, ఎన్. జయబాబు, హెడ్ కానిస్టేబుళ్లు కె. దాతురామ్, జె. జానయ్య, యండి. అబ్దుల్ ఘనీ పాషా, హోంగార్డ్ పి. శ్రీనివాస్ రావులను సన్మానించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ఐలు కామరాజు, సురేష్, ఖమ్మం జిల్లా హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షులు సీసీ-21 ఈ. వెంకటేశ్వర్లు, సీనియర్ అడ్వైజర్ డి. రమేష్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



