ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ను కుల అహంకారంతో పరుష పదజాలంతో దూషించడం అత్యంత సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
ఈరోజు ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో తాత మధు ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో స్పీకర్పై వ్యక్తిగతంగా, కులాన్ని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అన్నారు. దళిత స్పీకర్ను అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నీతులు చెప్పే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు సృష్టించడం ఆయన స్థాయికి తగదని విమర్శించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బార్ల ముత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తలారి రాకేష్, సమీర్, ఎన్ఎస్యూఐ శేషి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు యాదగౌడ్, ప్రభాకర్, ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్, నవనీత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



