సింగపూర్ కంపెనీల ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్బాబు సమావేశం
హైదరాబాద్/మంథని, సెప్టెంబర్ 16: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్ రంగంలో సింగపూర్కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి, రాష్ట్రంలో ఫ్యాబ్ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా సింగపూర్ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్ ట్రేడ్ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైంది. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హబ్’ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హై వాల్యూ ఇండస్ట్రీస్, ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ అండ్ డీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ కంపెనీలకు విస్తృత అవకాశాలున్నాయన్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, అవకాశాలపై అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’లో సింగపూర్ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంక, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ డా.ఫ్రాన్సిస్ చోంగ్, ఇండియా డైరెక్టరేట్ డైరెక్టర్ జీన్ యీ, సౌత్ ఏషియా ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్ ఆట్రీ టూన్, తదితరులు పాల్గొన్నారు.


