అనకాపల్లి జిల్లా, జూలై 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎలమంచిలి ఎంపీడీవో దీపిక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో కార్యక్రమం పురోగతిని పరిశీలించి, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా BLOలు, BLAలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి అర్హులు మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమాన్ని మరింత వేగంగా పూర్తి చేసేందుకు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు.
గ్రామ ప్రజల సహకారంతో SIR కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి, ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఎంపీడీవో దీపిక పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. గిరిప్రసాద్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

