రాజమహేంద్రవరం, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR–2026)పై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులు శ్రీమతి కె. మాధవీలత ఐఏఎస్, జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పలు అంశాలను ఎమ్మెల్యే నల్లమిల్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ మరో ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారి వివరాలపై చేపడుతున్న పరిశీలన, ఓటర్ల చిరునామాల ధ్రువీకరణ, అర్హత లేని లేదా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓట్ల గుర్తింపు వంటి అంశాలపై వివరాలు కోరారు.
అలాగే SIR–2026లో కొత్తగా నమోదైన ఓట్లను ప్రస్తుత బూత్లలోనే సర్దుబాటు చేస్తారా, లేక ఓటర్ల సంఖ్య పెరిగిన ప్రాంతాల్లో కొత్త పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తారా అనే అంశంపైనా ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు (BLO) నిర్వహిస్తున్న పాత్ర, నోటీసులు జారీ చేసిన ఓటర్ల వివరాల పరిశీలన, తదుపరి చేపట్టే చర్యలపై కూడా స్పష్టత కోరారు.
ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి అధికారులను కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడటంతో పాటు, అర్హత లేని ఓట్లను గుర్తించి జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.



