అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయంలో పాలక మండలి సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని పాలక మండలి సభ్యులతో పలు అంశాలపై చర్చించారు.
సమావేశంలో కమిటీకి సంబంధించిన పలు తీర్మానాలపై చర్చించడంతో పాటు పాలకవర్గం కాలపరిమితి పెంపునకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే ఏఎంసీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను సభ్యులు పరిశీలించారు.
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి సూచించారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నీటి లభ్యత, నీటి పొదుపు, సాగు విధానాలపై అవసరమైన సూచనలు అందించాలని సభ్యులకు వివరించారు.
రైతులకు అవగాహన కార్యక్రమాలను ఆత్మ కమిటీతో సమన్వయం చేసుకుని నిర్వహించాలని నల్లమిల్లి కోరారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారాన్ని రైతులకు సకాలంలో అందించి, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ జుత్తుక సూర్యకుమారి, వైస్ ఛైర్మన్ కోనాల వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.




