సుమతికి న్యాయం జరిగేలా చర్యలు.. డీఎస్పీ స్పష్టమైన హామీ
ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): ఏఎస్ పేట మండలం చిరమన గ్రామానికి చెందిన దళిత మహిళ పులపాక సుమతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట అంబేద్కర్ ఇండియన్ మిషన్, బీఎస్పీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఆగస్టు 21న సుమతికి చెందిన 2.50 ఎకరాల భూమిలోకి చందలూరుపాడు గ్రామానికి చెందిన మండవ వీరయ్య నాయుడు అక్రమంగా ప్రవేశించి జామాయిల్ మొక్కలను జేసీబీలతో తొలగించారని నిరసనకారులు ఆరోపించారు. ప్రశ్నించిన సుమతిని కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని తెలిపారు. దీనిపై ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు, విచారణ జరగలేదని పేర్కొన్నారు. దీంతో డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. స్పందించిన డీఎస్పీ స్వయంగా వచ్చి సుమతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ కాపీని బాధితురాలికి అందజేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నందా ఓబులేసు, పట్టెడ మురళి, టి.కృష్ణ, వాగాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


