పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
ఎరుకువానిపాలెం పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
అనకాపల్లి మండలం:ఎరుకువానిపాలెం,
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఎరుకువానిపాలెంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ గారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య పరిరక్షణ పురస్కార గ్రహీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “శ్రీ వినాయకుడిని భక్తితో పూజించడం మన సంప్రదాయం. అదే సమయంలో ఆయనకు ప్రీతిపాత్రమైన ప్రకృతిని కాపాడటం కూడా మన పవిత్రమైన బాధ్యత” అని అన్నారు.
“పండుగ మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ప్రకృతికి నష్టాన్ని కలిగించకూడదు. మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా మన సంప్రదాయాన్ని గౌరవించడంతో పాటు జలవనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చు” అని తెలిపారు.
విద్యార్థులు తమ ఇళ్లలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు, కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల ప్రజలకు కూడా పర్యావరణహిత వినాయక చవితి ప్రాముఖ్యతను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
“ఒక ఇంట్లో మట్టి వినాయకుడు ప్రతిష్ఠించడం ఒక చిన్న అడుగు కావచ్చు… కానీ అలాంటి లక్షల చిన్న అడుగులే పర్యావరణ పరిరక్షణలో గొప్ప మార్పును తీసుకువస్తాయి” అని ప్రధానోపాధ్యాయులు అన్నారు.పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ అరిగే శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ కె. నరసింహమూర్తి గారు, శ్రీ బి. వై. వై. ఎస్. కృష్ణారావు గారు, శ్రీమతి పి. జయశ్రీ గారు, శ్రీమతి డి. శ్రీలత గారు, శ్రీమతి ఎస్. సుజాత గారు,శ్రీమతి ఉమా గారు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
“శ్రీ వినాయకుడిని ఆహ్వానిద్దాం – ప్రకృతిని పరిరక్షిద్దాం;మట్టి వినాయకుడిని పూజిద్దాం – జలవనరులను కాపాడుదాం;భక్తిని చాటుదాం – బాధ్యతను నిర్వర్తిద్దాం.”“ఈ వినాయక చవితి… మన భక్తికి మాత్రమే కాదు,మన ప్రకృతి పరిరక్షణకు కూడా పండుగ కావాలి.”అని నినాదాలు అందరినీ జాగృతి పరచడమైనది.

