వినాయక ఉత్సవాలకు పోలీసుల భద్రతా సూచనలు
మండపాల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : CI సత్యనారాయణ
కందుకూరు/యాచారం, సెప్టెంబర్ 10: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. సీఐ బి. సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్ఐలు డి. సునీల్ కుమార్, జి. సైదులు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ముందుగానే తీసుకోవాలని, విద్యుత్ షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
లౌడ్స్పీకర్లు, డీజేల వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
వినాయక ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ బి. సత్యనారాయణ కోరారు. ఎలాంటి సమస్యలు, అనుమానాస్పద ఘటనలు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.




