పాడేరు మండలం శ్రీకృష్ణపురం హైస్కూల్లో విద్యార్థినుల కోసం నిర్వహిస్తున్న మూడు నెలల సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది.విద్యార్థినులు శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఆత్మరక్షణకు సంబంధించిన వివిధ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలు, విద్యార్థినులు తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఇందులో భాగంగానే విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, అప్రమత్తతతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణను అందిస్తున్న పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ & ఎగ్జామినర్ బాకూరు పాండు రాజును పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు మంజుల ఆధ్వర్యంలో అధ్యాపకుల బృందం, విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాండు రాజుకు శాలువా కప్పి సత్కరించి, గిఫ్ట్ను అందజేశారు.
ఈ సందర్భంగా పాండు రాజు మాట్లాడుతూ.. సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా విద్యార్థినుల్లో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత, నిర్ణయాత్మకత వంటి లక్షణాలను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణలో విద్యార్థినులు చూపిస్తున్న ఆసక్తి, ఉత్సాహం అభినందనీయమన్నారు.
మూడు నెలల శిక్షణలో భాగంగా విద్యార్థినులకు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము రక్షించుకునే పద్ధతులు, ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించే విధానం, ప్రాథమిక కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తదితర అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
తనను ఘనంగా సన్మానించిన పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు మంజుల, అధ్యాపకుల బృందానికి, అలాగే శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థినులకు పాండు కరాటే అకాడమీ తరఫున పాండు రాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థినుల భద్రత, సాధికారతకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.


