తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం గ్రామంలోని పలు వీధుల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడిన ప్రతిసారి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంతలు, బురదతో రోడ్లు నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. రోడ్డు పక్కనే మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోందని, దోమల బెడద కూడా పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యను అధికారులు వెంటనే పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టి, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



