పద్మనాభం మండలంలో సర్వే శిక్షణా కార్యక్రమం విజయవంతం
విశాఖపట్నం,పద్మనాభం, ఆగస్టు 10 (పున్నమి ప్రతినిధి):
జిల్లా జనాభా గణాంకాల పుస్తక సర్వేకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని పద్మనాభం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో తహసీల్దార్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ సర్వే ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన జనాభా వివరాలు, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు.
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు 30 రోజుల పాటు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనుంది. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు గణకులకు శిక్షణ ఇచ్చి, సమాచార సేకరణలో పాటించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివరాల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ కార్యాలయం, న్యూఢిల్లీ నుంచి వచ్చిన సంయుక్త సంచాలకులు ఎం.కె. తివారీ, సహాయ సంచాలకులు పంకజ్ కౌశిక్, ఆంధ్రప్రదేశ్ జనగణన సంచాలకుల కార్యాలయం నుంచి సహాయ సంచాలకులు సుప్రేజ్ కె. పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కేంద్ర అధికారులు గణకులకు పలు సూచనలు అందిస్తూ, గ్రామాల వారీగా ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు.
గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం ఎంతో కీలకంగా నిలవనుంది.




