ఫోర్లైన్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మర్రి నిరంజన్ రెడ్డి వినతి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 10: నాగార్జునసాగర్లో నిర్వహిస్తున్న వరుణయాగానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ముఖ్య సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేట్ నుంచి గురునానక్ కాలేజీ మీదుగా మాల్ వరకు సెంట్రల్ లైటింగ్, డివైడర్తో కూడిన ఫోర్లైన్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది మంది వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, కూలీలు హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఇటీవల తక్కలపల్లి వార్డు మెంబర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డు పనులను సెంట్రల్ లైటింగ్తో కలిపి తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వంట సిబ్బందికి గ్యాస్ సిలిండర్లు అందించాలని కోరగా, మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి HAM పథకం ద్వారా నిధులు కేటాయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున మర్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






