అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు
నెల్లూరు: 16వ డివిజన్ రాంజీ నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు” కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల ఉన్న బాధ్యత, మంత్రి డా. పొంగూరు నారాయణ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
ప్రచారంలో భాగంగా వీఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, వీఆర్సీ లెక్చరర్ రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రజల కోసం సేవ చేయాలని ఆయన సూచించారు. రాంజీ నగర్లో రోడ్లు, తాగునీరు, మున్సిపల్ సేవల అభివృద్ధి కొనసాగాలంటే కూటమికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



