జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజ్యసభ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్ తీర ప్రాంత మహిళా మత్స్యకారుల ఉపాధి, జీవనోపాధి, మహిళా మత్స్యకార సహకార సంఘాల బలోపేతం బ్లూ ఎకానమీ విధానంలో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలపై రాజ్యసభలో ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) సమాధానమిస్తూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మహిళలను ప్రాధాన్య లబ్ధిదారులుగా గుర్తించి, సాధారణ వర్గానికి 40 శాతం ఆర్థిక సహాయం ఉండగా మహిళలకు 60 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా మహిళల ఆధ్వర్యంలోని మత్స్యకార సహకార సంఘాలను ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గా బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంస్థలకు పి.యమ్.యమ్.యస్.వై, మరియు పి.యమ్. యమ్ .కె.యస్.యస్. వై పథకాల ద్వారా ఆర్థిక సహాయం, మౌలిక వసతులు, శిక్షణ మరియు ఇతర ప్రయోజనాలు అందచేస్తున్నట్లు తెలిపారు.
సాంప్రదాయ మహిళా మత్స్యకారుల జీవనోపాధి రక్షణ కోసం సముద్రపు పచ్చి సాగు, అలంకార చేపల పెంపకం, వరి-చేపల సాగు, కేజ్ కల్చర్, చేపల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి విభిన్న ఆదాయ వనరులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 66 మహిళా మత్స్యకార సహకార సంఘాలు యఫ్ , యఫ్. పి.ఒ లుగా మార్పు చేయబడగా, వాటిలో 10 యఫ్.యఫ్. పి.ఒ లకు నిర్వహణ వ్యయం ఈక్విటీ గ్రాంట్ రూపంలో రూ.69.11 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 6 మహిళా మత్స్యకార సహకార సంఘాలు లు.యఫ్.యఫ్. పి.ఒ ల గా మార్పు చేయబడగా, ఒక దానికి రూ.90,000 ఒకసారి మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ సందర్భంగా డా. బీద మస్తాన్ రావు యాదవ్ గమాట్లాడుతూ, తీర ప్రాంత మహిళా మత్స్యకారుల ఆర్థిక సాధికారత, సహకార సంఘాల బలోపేతం, విలువ ఆధారిత చేపల ఉత్పత్తులు మరియు మార్కెటింగ్కు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత మహిళలకు కేంద్ర పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


