కొడవలూరు మండలం యల్లయ్యపాలెం గిరిజన కాలనీలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేస్తూ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చినట్లు తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో యల్లయ్యపాలెం పంచాయతీ అభివృద్ధి కోసం రూ.2,93,02,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా 12 మంది పేద కుటుంబాలకు రూ.10,74,000 ఆర్థిక సాయం అందించామని, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1,39,00,000 తో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రూ.10 లక్షలతో స్మశానవాటిక ప్రహరీ గోడలు, రూ.33 లక్షలతో 5 అంతర్గత సీసీ రోడ్లు, రూ.60 లక్షలతో 14 కిలోమీటర్ల బ్రాంచ్ రోడ్డు నిర్మాణం, రూ.9 లక్షలతో ట్రైన్ హౌస్ కాలనీలో డ్రైనే నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ ద్వారా రూ.59,50,000 వ్యయంతో వివిధ ట్రాన్స్ఫార్మర్లు, 6 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొడవలూరు మండలంలో రూపుదిద్దుకుంటున్న బిర్లా ఫ్యాక్టరీ అక్టోబర్ నాటికి ప్రారంభం కానుందని, త్వరలో బీపీసీఎల్ ఫ్యాక్టరీ కూడా రానుందని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కిసాన్ సెజ్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.



