
- ఎంట్రన్స్ కామన్ ఏర్పాటుకు దాతగా ముందుకొచ్చిన BRS నాయకుడు సాంబశివ రెడ్డి
బాచుపల్లి: పున్నమి విలేకరి సందీప్ 27/07/2026
బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో నివసిస్తున్న లబ్ధిదారులు ఈరోజు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ వివేక్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నివాస సముదాయంలో ఎదుర్కొంటున్న పలు మౌలిక సమస్యలపై ఎమ్మెల్యేకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా 9వ అంతస్తులో సిమెంట్ పెచ్చులు ఊడిపడుతుండటం వల్ల ఎదురవుతున్న ప్రమాదాలను, పిల్లలు ఆడుకోవడానికి పార్కు లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కైసర్ నగర్, బహదూర్ పల్లి, నిజాంపేట్, డి.పోచంపల్లి, దుండిగల్ తదితర ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టెర్రస్లపై పెచ్చులు ఊడుతున్న తీవ్ర సమస్యను కూడా వివరించారు.
కాగా, కాలనీవాసుల సౌకర్యార్థం కామన్ ఎంట్రన్స్ (ప్రధాన ద్వారం) ఏర్పాటుకు BRS పార్టీ GHMC నిజాంపేట్ సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి గారు దాతగా ముందుకు రావడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
లబ్ధిదారుల విజ్ఞప్తులపై ఎమ్మెల్యే శ్రీ వివేక్ గారు అత్యంత సానుకూలంగా స్పందించారు. సమస్యలన్నింటినీ పరిశీలించి, త్వరలోనే పరిష్కరిస్తానని, లబ్ధిదారుల కోరికలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి జేఏసీ సభ్యులు మోహన్, దుర్గాప్రసాద్లతో పాటు స్థానిక నివాసితులు సత్యనారాయణ, జయరాజు, మల్లేష్, నరేష్, రామారావు మరియు ఇతర కాలనీవాసులు పాల్గొన్నారు.

