శంషాబాద్లో హృదయ విదారక ఘటన.. రోడ్డుపై పసికందును వదిలేసిన కర్కశులు
శంషాబాద్, జూలై 22: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని రాళ్లగూడ ఇంద్రానగర్ రాజీవ్ గృహాల సమీపంలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న పేగు బంధాన్నే మరిచిన గుర్తుతెలియని వ్యక్తులు నవజాత శిశువును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోవడం స్థానికులను కలచివేసింది.
ఉదయం ఆ ప్రాంతంలో వెళ్తున్న స్థానికులకు పసికందు ఏడుపు వినిపించడంతో వారు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, రోడ్డుపక్కన ఓ శిశువు ఒంటరిగా కనిపించింది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాపను అక్కడ వదిలేసి వెళ్లిన వ్యక్తులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. శిశువును ఎవరు, ఎందుకు అక్కడ వదిలివెళ్లారనే కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తూ ముమ్మర గాలింపు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమాయక పసికందును ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.


