– ప్రజలకు మరింత చేరువై మెరుగైన సేవలు అందించాలి
– క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
– పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు రేణిగుంట డీఎస్పీ సత్కారం, దిశానిర్దేశం
పోలీస్ శాఖలో పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని.. బాధ్యతలు, ప్రజల పట్ల సేవాభావం, జవాబుదారీతనం మరింత పెరగడానికి లభించిన గొప్ప అవకాశమని రేణిగుంట డీఎస్పీ (SDPO) శ్రీ వై. శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు (IPS) ఉత్తర్వుల మేరకు, రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఆరుగురు సిబ్బందిని శనివారం ఆయన ఘనంగా సత్కరించారు. నూతన హెడ్ కానిస్టేబుళ్లను అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు.
-పదోన్నతి పొందిన సిబ్బంది వీరే:
బి.డి. జగన్మోహన్ (రేణిగుంట పీఎస్)
పి. బాలకృష్ణ (గాజులమండ్యం పీఎస్)
ఇ. శ్రీపతి (ఎయిర్పోర్ట్ పీఎస్)
వి. రమణ (చిట్వేలు పీఎస్)
వి. వెంకటయ్య (ఓబులవారిపల్లె పీఎస్)
ఎం. కవిత (ఏర్పేడు పీఎస్)
-ప్రజానుకూల పోలీసింగ్ అందించాలి:
ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్లను ఉద్దేశించి డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఇప్పటివరకు సంపాదించిన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ విభాగానికి ప్రజలే కేంద్రబిందువని, వారి సమస్యలను సానుభూతితో, ఓర్పుతో వినాలని తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన స్పందిస్తూ, చట్టపరిధిలో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రజానుకూల పోలీసింగ్ను అందించాలని దిశానిర్దేశం చేశారు.
-ప్రవర్తనే శాఖకు గీటురాయి:
పోలీసు సిబ్బంది ప్రవర్తన, పనితీరు, సేవా దృక్పథమే డిపార్ట్మెంట్పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రధాన ఆధారమని డీఎస్పీ గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణతో ఆదర్శప్రాయంగా విధులు నిర్వర్తించి శాఖకు మంచి గౌరవం తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహం, అంకితభావంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని, ప్రజల మన్ననలు పొందాలని ఆయన ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.


