సిర్పూర్ టౌన్లో రైళ్ల నిలుపుదల, వందే భారత్లో అదనపు బోగీల ఏర్పాటు కోసం వినతి.
హైదరాబాద్, జూలై 11: సిర్పూర్ నియోజకవర్గ ప్రజల రైల్వే అవసరాలపై సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి పలు కీలక విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో శనివారం కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిర్పూర్ కాగజ్నగర్ నుండి హౌరా జంక్షన్ వరకు కొత్త రైలును ప్రారంభించాలని కోరారు. ఈ రైలు ప్రారంభమైతే కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సహా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న బెంగాలీ ప్రజలకు కోల్కతా (హౌరా) చేరుకోవడం మరింత సులభమవుతుందని వివరించారు.
అదేవిధంగా సికింద్రాబాద్–నాగపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సిర్పూర్ టౌన్ రైల్వే స్టేషన్లో మరిన్ని ముఖ్యమైన రైళ్లకు నిలుపుదల కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఎమ్మెల్యే వినతిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం సిర్పూర్ నియోజకవర్గ ప్రజల్లో ఆశాభావాన్ని కలిగిస్తోంది.


