బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత
ఈరోజు (09-07-2026) వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కావలి పట్టణంలోని 24వ వార్డు కచేరిమిట్టలో ఇటీవల దాడికి గురైన గిరిజన మహిళను పరామర్శించారు. బాధితురాలిని కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని, ఆమెకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి పూజిత… ఓ గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత అమానుషమని, బాధిత కుటుంబంపైనే తిరిగి కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవకపోయి ఉంటే ఈ కేసు కనుమరుగై ఉండేదని అన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతున్నారని పేర్కొన్నారు.
ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన కాకాణి పూజిత… బాధిత గిరిజన మహిళకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


