అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ, జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిల నియామక ప్రక్రియలో భాగంగా, అనపర్తి నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు సురేష్ బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్కు విచ్చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
సమావేశానికి అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన గ్రామశాఖ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. వీరంతా ఏకగ్రీవంగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డికి అనపర్తి టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ పెద్దలను కోరినట్లు సమావేశంలో వెల్లడైంది.
అనంతరం పలువురు ముఖ్య నాయకులతో పార్టీ పెద్దలు విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. సేకరించిన వివరాలను పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక రూపంలో సమర్పిస్తామని, అనంతరం పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నల్లమిల్లి కుటుంబం అందించిన సేవలను గుర్తు చేశారు. దివంగత నల్లమిల్లి మూలారెడ్డి పార్టీ అభివృద్ధికి చేసిన కృషి, అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుమారు 12 సంవత్సరాల పాటు పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన బీజేపీలో చేరిన అనంతరం గత రెండేళ్లుగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యకర్తలను సమీకరించడం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తీరును నాయకులు ప్రశంసించారు.




