తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూన్ 26: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గత కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సూచించారు.
18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరు కార్డులో పేరు, వయస్సు, ఫోటో తదితర వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సరిచేసుకోవచ్చని చెప్పారు. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మారిన వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఫారం-8 ద్వారా మార్పులు చేసుకోవచ్చని వివరించారు. మరణించిన వారి పేర్లు, ద్వితీయ ఓట్లు తొలగించేందుకు ఫారం-7 సమర్పించాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాలు, బూత్ స్థాయి అధికారులు వద్ద నేరుగా ఫారాలు సమర్పించవచ్చని తెలిపారు. ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ కోసం పదో తరగతి మెమో లేదా జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత చిరునామా రుజువు, ఒక పాస్పోర్టు సైజు ఫోటో జతపరచాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఒక్కరు కూడా ఓటు లేకుండా మిగిలిపోకూడదని అన్నారు. చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే దరఖాస్తులు అందజేయాలని కోరారు.
శుక్రవారం తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే సందర్భంగా తాళ్లపూడి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా కిలాని వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశాభివృద్ధే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు

