యలమంచిలి – పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి మండల రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త అందించింది. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో మొత్తం 956 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి మోహనరావు తెలిపారు. ఆర్జీఎల్-2537, బీపీటీ-5204, ఎంటీయూ-1318, ఎంటీయూ-1224, ఎంటీయూ-1064, ఆర్జీఎల్-7310, బీపీటీ-2846 తదితర నాణ్యమైన రకాల విత్తనాలు రైతులకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
నేల సారాన్ని పెంపొందించేందుకు జనుమ, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలను కూడా గత రెండు వారాలుగా రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పశుగ్రాస సాగు చేసే రైతులు ఎరువులను మితంగా వినియోగించాలని సూచించారు.
లక్కవరం పీఏసీఎస్ సొసైటీ రైతు సేవా కేంద్రం పరిధిలో మరియు డీలర్ల వద్ద 80 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన రైతులు ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.

