శ్రీ కనక దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ…..
సిరిసిల్ల చేనేత కళారత్న విజయ్ కుమార్ అద్భుత సృష్టి.. వారం రోజులు శ్రమించి 200 గ్రాముల బరువుతో రూపకల్పన
ఇంద్రకీలాద్రి, 16 జూన్ 2026:
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గఅమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు అందజేశారు.
‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’ ప్రత్యేకతలు:
చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ పట్టుచీరను విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు.
పరిమాణం & బరువు: ఈ అద్భుత పట్టుచీర పొడవు 5.5 మీటర్లు (ఐదున్నర మీటర్లు), వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం.
ఈ పట్టుచీరను సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ (Ikkat Design) వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించారు.
ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది.
ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “గతంలో నేను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయి. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో మేము ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందాము. ప్రధాని ప్రశంసలు పొందిన అదే స్ఫూర్తితో, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించడం జరిగింది.
అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయఈవో శీనానాయక్ పరిశీలించి,అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయకళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ కోరారు.



