వీధిలైట్లు లేక ప్రజలకు ఇబ్బందులు
మేడిపల్లి నక్కర్త గ్రామంలో 25 రోజులుగా అంధకారం
పున్నమి న్యూస్
26 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో గత 25 రోజులుగా వీధిలైట్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో గ్రామమంతా చీకటిమయం కావడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
గ్రామంలోని ప్రధాన వీధుల్లో లైట్లు వెలగకపోవడంతో పాములు, కుక్కల భయం ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
వీధిలైట్లు సరిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజాప్రతినిధుల తీరుపై గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వీధిలైట్లు మరమ్మతులు చేసి గ్రామంలో వెలుతురు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.



