కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుచుకునే అవకాశముండగా, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఎన్నికలతో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. జేడీఎస్కు స్వతంత్రంగా గెలిచే సంఖ్యాబలం లేకపోవడంతో బీజేపీ ఆయనకు మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న తలెత్తింది. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు కాంగ్రెస్కు ఐదు మంది, బీజేపీకి ఆరుగురు, జేడీఎస్కు ఒక సభ్యుడు ఉన్నారు.
రాజకీయ సమీకరణాలు, కుల సమతుల్యత, మిత్రపక్షాల మధ్య అవగాహన వంటి అంశాలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కొత్త మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.


